అస్సాం సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ.. ఘనంగా ప్రమాణ స్వీకారం

  • అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ
  • హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు 
  • శర్మతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం
  • వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-ఎన్డీయే కూటమి
అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహ‌టిలోని ఖానాపారాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య.. హిమంత బిశ్వ శర్మ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అస్సాం సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న శర్మ, ప్రమాణం చేస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిమంతతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి రామేశ్వర్ తేలి, అసోం గణ పరిషత్ (ఏజీపీ) అధ్యక్షుడు అతుల్ బోరా, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) నేత చరణ్ బోరో, సీనియర్ బీజేపీ నేత అజంత నియోగ్ ఉన్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తో పాటు 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు హాజరయ్యారు. వీరితో పాటు అస్సాంలోని వైష్ణవ మఠాలకు చెందిన 15 మంది సత్రాధికారులు వంటి ప్రముఖ మత పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆయన తొలిసారిగా 2021లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ, ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా హిమంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 

Himanta Biswa Sarma
Assam
Assam CM
BJP
NDA
Oath Ceremony
Guwahati
Narendra Modi
Amit Shah
Assam Elections

More Telugu News